Sunday, August 7, 2011

పాశ్చాత్య నాగరికత మోజులో సంప్రదాయాలను మరచిపోవద్దు

పాశ్చాత్య నాగరికత మోజులో సంప్రదాయాలను మరచిపోవద్దు
ముఖ్యమంత్రి కె.కిరణ్‌కుమార్ రెడ్డి

August 5th, 2011
కాచిగూడ, ఆగస్టు 4: తెలుగు భాష, తెలుగు సంస్కృతి, తెలుగు సాంప్రదాయాలను పరిరక్షించడం అందరి బాధ్యతగా తీసుకోవాలని, పాచ్చాత్య నాగరికత మోజులో మన సాంప్రదాయాలను మరిచిపోవద్దని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.కిరణ్ కుమార్ రెడ్డి కోరారు. గురువారం సాయంత్రం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో మండలి వెంకట కృష్ణారావు సంస్కృతి పురస్కారాన్ని మారిషస్ ఆంధ్ర మహాసభకు అందించే కార్యక్రమాన్ని పబ్లిక్ గార్డెన్‌లోని జూబ్లీహాల్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి విచ్చేయగా తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యాక్షులు హనుమాండ్ల భూమయ్య అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా మారిషస్ ఆంధ్ర మహాసభ అధ్యక్షులైన కోడి రమణకు మండలి వెంకట కృష్ణారావు సంస్కృతీ పురస్కారంగా 25 వేల నగదు, జ్ఞాపిక, ప్రశంసాపత్రాన్ని అందించి సత్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ విదేశాలల్లో రాష్ట్రాయేతర ప్రాంతాల్లోవున్న తెలుగువారి మధ్య సత్సంబంధాలను కొనసాగించాలని కోరారు. మారుతున్న కాలానికి అనుగుణంగా తెలుగుభాషను మరింత పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. ఆంగ్లభాషలో విద్యాభ్యాసంతో ఉద్యోగ అవకాశాలు మెండుగావున్నా మన భాషను మాత్రం మర్చిపోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అతిధిగా శాసనమండలి అధ్యక్షులు డా. ఎ.చక్రపాణి ప్రసంగిస్తూ ఇతర రాష్ట్రాల్లో తెలుగువారు భాషా సంస్కృతుల పరిరక్షణ కోసం ఎంతో తపనపడుతున్నారని వారికి అండగానిలిచి వారి సమస్యలు పరిష్కరించేందుకు ముందుకు రావల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మండలి బుద్దప్రసాద్, తెలుగు విశ్వవిద్యాలయం రిజిష్ట్రార్ భట్టు రమేష్, అంతర్జాతీయ తెలుగు కేంద్రం ఇన్‌చార్జీ డైరెక్టర్ ఆచార్య మునిరత్నం నాయుడు, డా. చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment